పంజాగుట్ట శ్మశానవాటికలో పసికందు మృతదేహం మాయం.. తల్లిదండ్రుల ఫిర్యాదు
హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేసిన ఆరు నెలల పసికందు మృతదేహం అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అనారోగ్యంతో ఒకే రోజు వ్యవధిలో కవల పిల్లలను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన మరో విషాదంగా మారింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలల కవలల్లో ఒక చిన్నారిని పంజాగుట్ట శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే అనంతరం ఖననం చేసిన ప్రాంతాన్ని పరిశీలించగా అక్కడ ఖాళీ గుంత మాత్రమే కనిపించింది. చిన్నారి మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం ఎలా అదృశ్యమైంది? ఎవరైనా గుంతను తవ్వి తీసుకెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
ఇప్పటికే ఇద్దరు చిన్నారులను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన తీవ్ర మనోవేదనకు గురిచేసింది. పోలీసులు శ్మశానవాటిక పరిసరాల్లోని వివరాలను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు.


