ఉత్తరప్రదేశ్లోని బరాబంకీలో ఓ మటన్ దుకాణంలోకి సుమారు 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ప్రవేశించడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. శుక్రవారం (ఆగస్టు 14) రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.
మటన్ షాపులోకి వచ్చిన కొండచిలువ అక్కడ ఉన్న మేకల వైపు వెళ్లింది. దీంతో భయపడిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇంతలో సురేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో అక్కడికి వచ్చాడు. చుట్టూ ఉన్నవారు భయపడుతున్నా.. అతడు మాత్రం కొండచిలువను చూసి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఏకంగా చేతులతోనే కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము అతడి చేతిని చుట్టుకుని బిగించింది. తప్పించుకునేందుకు ప్రయత్నించిన సమయంలో ఒకట్రెండు సార్లు చేతిపై కాటు వేసినట్లు సమాచారం. కొండచిలువలు సాధారణంగా విషపూరితమైనవి కాకపోయినా.. వాటి కాటు వల్ల గాయాలు, ఇతర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

అయినా సురేష్ ఏమాత్రం భయపడకుండా చివరకు కొండచిలువను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దాన్ని భుజాలపై వేసుకుని మెడకు చుట్టుకున్నాడు. అనంతరం కొండచిలువతో అందరి ముందే ఆటలాడుతూ కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా వైరల్గా మారినట్లు సమాచారం.


