Jammu Kashmir Independence Day | దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ జమ్మూకశ్మీర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. షోపియాన్లో భద్రతా సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న లష్కర్-ఎ-తైబా కమాండర్ అబిద్ రంజాన్ షేక్ తల్లిదండ్రులు తమ ఇంటి పైకప్పుపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ఊపుతూ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
ఉగ్ర కమాండర్ తల్లిదండ్రుల ఇంటిపై జాతీయ జెండా
అబిద్ రంజాన్ షేక్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతా వర్గాలు ఆరోపిస్తున్నాయి. కశ్మీర్లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనలతో అతనికి సంబంధాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి.
స్థానికేతర కార్మికులపై జరిగిన లక్షిత దాడులకు కూడా అతను ఆదేశాలు ఇచ్చినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది.
2021 ఘటనను గుర్తుచేసిన దృశ్యం
షోపియాన్లో చోటుచేసుకున్న ఈ ఘటన 2021లో జరిగిన మరో సంఘటనను గుర్తుచేసింది. అప్పట్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ తండ్రి ముజఫర్ వానీ ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ రెండు ఘటనల్లోనూ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు జాతీయ జెండాను ఎగురవేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రశాంతంగా స్వాతంత్ర్య వేడుకలు
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ప్రసంగంలో 2019లో రద్దైన రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా లోక్భవన్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సమ్మిళిత సమాజ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


