హైదరాబాద్ మల్కాజ్గిరి, మేడ్చల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం ధర్నాకు దిగారు.
పట్టణాలు పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతిరోజూ తెల్లవారుజామునే విధులకు హాజరవుతున్న తమకు గత ఎనిమిది నెలలుగా చేతి గ్లౌజులు, చీపుర్లు, సబ్బులు, నూనె, బెల్లం వంటి భద్రతా, సంక్షేమ సదుపాయాలు అందడం లేదని కార్మికులు ఆరోపించారు.
సైబరాబాద్ కార్పొరేషన్లో విలీనం చేసినప్పటికీ.. తమకు మాత్రం మున్సిపల్ పాలనలో ఉన్న వేతనాలే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పన్నుల పేరుతో నెలకు రూ.500 కోత విధిస్తున్నారని ఆరోపించారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు బీజేపీ నాయకుడు అమరం మోహన్రెడ్డి మద్దతు తెలిపారు. సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి భద్రతా పరికరాలు, కనీస వేతనాలు కల్పించాలని కార్మికులు డిమాండ్ చేశారు.


