ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్కు సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు మరో మలుపు తిరిగింది. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమయ్యాడనే ఆరోపణలతో కేసు ఎదుర్కొంటున్న సందీప్కు బెయిల్ లభించిన కొద్ది గంటల్లోనే.. అతడు గంజాయి వినియోగిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పరిణామంతో పోలీసులు దర్యాప్తును మరో కోణంలో కొనసాగిస్తున్నారు.
రోడ్డు ప్రమాదం తర్వాత కేసు నమోదు
ఈ నెల 1న రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా కారు నడపడంతో పాటు ప్రమాదం జరిగిన తర్వాత వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడనే ఆరోపణలపై సందీప్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో అతడిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్లతో పాటు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సందీప్ మద్యం సేవించినట్లు ఆధారాలు లభించలేదని, యూరిన్ డ్రగ్స్ స్క్రీనింగ్లోనూ నెగెటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే వైరల్ వీడియో
ఈ కేసులో భాగంగా మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పోలీసులు సందీప్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరైంది.
అయితే బుధవారం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారింది. అందులో సందీప్ గంజాయి పీలుస్తున్నట్లుగా కనిపిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని రాయదుర్గం ఇన్స్పెక్టర్ భూపతి వెల్లడించారు.
రక్త నమూనాలు ఎఫ్ఎస్ఎల్కు..
వైరల్ వీడియో నేపథ్యంలో సందీప్ రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. అధునాతన ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గతంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందా అనే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.
వీడియో పాతదిగా కనిపిస్తున్నప్పటికీ.. అందులో ఉన్న వ్యక్తి సందీపేనా, వీడియో ఎప్పుడు చిత్రీకరించారు, ఆ సమయంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందా వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఎలాంటి తుది నిర్ధారణకు రాలేదని, ఫోరెన్సిక్ నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.