రూపా రెడ్డి హత్యకు నిరసనగా మేడ్చల్లో ప్రైవేట్ పాఠశాలల బంద్
మేడ్చల్: నల్గొండలోని నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యకు నిరసనగా మేడ్చల్లో శుక్రవారం ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయనున్నారు. తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం (TRSMA) పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేడ్చల్ ప్రాంతీయ కమిటీ నాయకులు తెలిపారు.
రూపా రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తూ పాఠశాలల యాజమాన్యాలు, కరెస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించి, ఘటనపై ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు.
మహిళలు, విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.