మేడ్చల్ 297వ డివిజన్లో గుంతలమయంగా రోడ్లు.. తక్షణ మరమ్మతులకు డిమాండ్
మేడ్చల్: 297వ డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్ల సమస్యపై మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత రామన్నగారి మణికంఠ గౌడ్ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
డివిజన్లోని పలు ప్రాంతాల్లో జోనల్ కమిషనర్తో కలిసి పర్యటించిన మణికంఠ గౌడ్.. ధ్వంసమైన రోడ్లు, భారీగా ఏర్పడిన గుంతలను చూపిస్తూ స్థానికుల ఇబ్బందులను వివరించారు. రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి రోడ్లు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు. రాత్రివేళల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, గుంతలను పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మణికంఠ గౌడ్ జోనల్ కమిషనర్ను కోరారు.