మేడ్చల్లో గడిమైసమ్మ తల్లి బోనాల ఏర్పాట్లపై డిప్యూటీ కమిషనర్ పరిశీలన
మేడ్చల్: మేడ్చల్ పట్టణంలో ఈ నెల 23న ఆదివారం నిర్వహించనున్న శ్రీ గడిమైసమ్మ తల్లి శ్రావణమాస బోనాల పండుగకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంశ్ గురువారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులను సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. పనిచేయని విద్యుత్ దీపాలను వెంటనే మరమ్మతులు చేయించారు. పండుగ సందర్భంగా పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, ఇతర అవసరమైన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
బోనాల పండుగకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ సూచించారు.