PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 1:27 pm Posted by : News Desk

మేడ్చల్‌లో నీట్‌-పీజీ పరీక్ష.. 7,357 మంది విద్యార్థులు హాజరు

మేడ్చల్: మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఆగస్టు 30న NEET-PG 2026 పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లాలో ఏర్పాటు చేసిన 19 పరీక్ష కేంద్రాల్లో 7,357 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.

పరీక్షను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.

అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలు, విద్యుత్‌, తాగునీరు, ఇతర మౌలిక వసతులు అందుబాటులో ఉంచనున్నట్లు అదనపు కలెక్టర్‌ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని, పరీక్షా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.