హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కకపోవడానికి రాష్ట్రంలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులకు బీజేపీ జాతీయ స్థాయిలో కీలక పదవులు లభించేవని గుర్తుచేసిన రాజాసింగ్.. ఈసారి జాతీయ కార్యవర్గంలో రాష్ట్రం నుంచి ఒక్కరికీ అవకాశం రాకపోవడం బాధాకరమన్నారు. ఈ పరిణామంపై రాష్ట్ర నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
‘ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవద్దు’
రాష్ట్ర బీజేపీలో చిన్నచిన్న విషయాలపైనా నేతలు ఢిల్లీకి వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు అధిష్ఠానం దృష్టిలో తెలంగాణ నేతలపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించే అవకాశం ఉందన్నారు.
నాయకులు తమ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయని రాజాసింగ్ తెలిపారు. తెలంగాణ నేతలు కూడా ఐక్యంగా పనిచేయాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్లో పార్టీ నేతలు ఎలా కలిసికట్టుగా పోరాడుతున్నారో అదే విధంగా తెలంగాణలోనూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే అందరి ప్రధాన లక్ష్యం కావాలని అన్నారు. ఐకమత్యంతో పనిచేస్తే భవిష్యత్తులో అధిష్ఠానం తగిన గుర్తింపు, పదవులు కల్పిస్తుందని రాజాసింగ్ పేర్కొన్నారు.