PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 4:34 am Posted by : News Desk

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు అదే నిజమైన నివాళి.. చంద్రబాబు భావోద్వేగ పోస్ట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు. దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

“దేశం నాకు ఏం చేసిందని కాకుండా.. దేశానికి నేను ఏం చేయగలనని ప్రతి ఒక్కరూ ‘అనే నేను..’ సంకల్పంతో ఆలోచించాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ఆకాంక్షించారు.

2047 నాటికి ‘వికసిత్ భారత్’, ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం కోరారు. 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్య్రం నుంచి సమృద్ధి వైపు.. వికాసం నుంచి వైభవం వైపు సాగాలని ఆకాంక్షించారు.

ఈ లక్ష్యాలను సాధించేందుకు అందరూ ఐక్యంగా అడుగులు వేయాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. తన సందేశాన్ని ‘జై తెలుగుతల్లి! జై హింద్!’ నినాదాలతో ముగించారు.

Slug: chandrababu-independence-day-message-80th-independence-day-swarna-andhra