కోయంబత్తూరు: స్వాతంత్ర్య దినోత్సవ వేళ కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 112 అడుగుల ఆదియోగి శివుని విగ్రహం మువ్వన్నెల కాంతులతో వెలిగిపోతూ సందర్శకులను ఆకట్టుకుంది.
రాత్రి వేళ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల లేజర్ లైట్లతో ఆదియోగి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఆదియోగి.. త్రివర్ణ వెలుగుల్లో మరింత అద్భుతంగా కనిపించాడు. దేశభక్తి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ అపురూప దృశ్యాలను చూసేందుకు వచ్చిన భక్తులు, పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. త్రివర్ణ కాంతుల్లో మెరిసిన ఆదియోగి దృశ్యాలను సోషల్ మీడియాలోనూ పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి.

జాతీయ పండుగల సందర్భంగా ఆదియోగి విగ్రహాన్ని ప్రత్యేక లైటింగ్తో అలంకరించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన త్రివర్ణ లైటింగ్ షో.. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి స్ఫూర్తిని ప్రతిబింబించింది.