PRAJA PULSE NEWS
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 3:34 pm Posted by : News Desk

చంద్రుడిపై శాశ్వత మానవ స్థావరం.. ఇస్రోకు నాసా ఆహ్వానం

హైదరాబాద్‌: చంద్రుడిపై పరిశోధనలను మరింత విస్తరించే దిశగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2032 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువంపై శాశ్వత మానవ స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక ‘మూన్ బేస్ మిషన్‌’లో భాగస్వామ్యం కావాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను నాసా ఆహ్వానించినట్లు సమాచారం.

బెంగళూరులో జరిగిన ఇండియా-యూఎస్‌ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ సమావేశంలో ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారంపై కీలక చర్చలు జరిగాయి. భవిష్యత్‌ చంద్ర పరిశోధనలు, శాస్త్రీయ సమాచార మార్పిడి, అంతరిక్ష సాంకేతికత వంటి అంశాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో నీటి మంచు సహా కీలక వనరులు ఉన్నాయనే అంచనాల నేపథ్యంలో ఈ ప్రాంతంపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. ఇస్రో ఇప్పటికే చంద్రయాన్‌ మిషన్ల ద్వారా చంద్రుడిపై కీలక పరిశోధనలు నిర్వహించింది. ముఖ్యంగా చంద్రయాన్‌-3 విజయంతో భారత్‌ ప్రపంచ అంతరిక్ష రంగంలో తన సామర్థ్యాన్ని చాటుకుంది.

ఈ నేపథ్యంలో నాసా-ఇస్రో మధ్య సహకారం మరింత విస్తరించడంపై ప్రాధాన్యం ఏర్పడింది. ఇస్రో ఛైర్మన్‌ వీ. నారాయణన్‌, అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ ద్వైపాక్షిక అంతరిక్ష సహకారం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

భవిష్యత్‌లో చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన, శాస్త్రీయ డేటా మార్పిడిలో భారత్‌-అమెరికా భాగస్వామ్యం కీలకంగా మారే అవకాశం ఉంది.