పాతబస్తీపై బండి సంజయ్ కీలక ప్రకటన.. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ హామీ
ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామని, బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని ప్రకటన
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ఆగస్టు 09 (నేటి ప్రస్థానం): తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాలను భారీగా నిర్వహించడంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పాలనలో లాల్దర్వాజ ఉజ్జయిని మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇస్తామని ప్రకటించి అమలు చేయలేదని బండి సంజయ్ ఆరోపించారు. లాల్దర్వాజ బోనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.5.50 లక్షలు మాత్రమే కేటాయించిందని, లక్షలాది మంది భక్తులు వచ్చే ఉత్సవాలకు ఈ నిధులు సరిపోవని అన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వస్తే పాతబస్తీలో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా తీర్చిదిద్దడంతో పాటు ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని, యువత ఆధ్యాత్మిక స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.